
- నన్ను ఓడించడానికి వందల కోట్లు ఖర్చు చేసిన్రు
- మావోయిస్టుల లెటర్ ఒరిజినలో.. కాదో తేలాల్సి ఉంది : మంత్రి సీతక్క
జయశంకర్భూపాలపల్లి/ఏటూరునాగారం, వెలుగు : ‘ఆదివాసీలు, గిరిజనులు, దళితులను బీఆర్ఎస్ లీడర్లు లారీలతో తొక్కించారు, పిల్లలను వేరు చేసి తల్లులను జైల్లో పెట్టిన్రు.. ఆదిలాబాద్, ఖమ్మం, ములుగు జిల్లా జలగలంచలో చెట్లకు కట్టేసి కొట్టిన చరిత్ర వాళ్లది’ అని మంత్రి సీతక్క మండిపడ్డారు. తనను ఓడించడానికి వందల కోట్లు ఖర్చు చేశారని, గిరిజన మహిళ మంత్రి అయితే ఓర్చుకోవడం లేదని విమర్శించారు. ములుగు జిల్లా ఏటూరునాగరంలో శుక్రవారం మీడియాతో మాట్లాడారు.
మావోయిస్ట్ పార్టీ పేరుతో ఇటీవల విడుదలైన ఓ లెటర్పై కొన్ని పార్టీలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాయని, మహిళనని కూడా చూడకుండా దుర్భాషలాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను ఓడించేందుకు రకరకాల శక్తులు, అనేక రకాల కుట్రలు చేశారని, అయినా ప్రజల మనిషిని కాబట్టే వారు తనను గెలిపించారని చెప్పారు. ప్రస్తుతం ఎక్కడైనా చిన్న చిన్న ఘటనలు జరిగితే ఆఫీసర్లను హెచ్చరిస్తున్నామని, పనితీరు మార్చుకోవాలని ఆదేశిస్తున్నామని చెప్పారు. ఫారెస్ట్ వాళ్లు ఇబ్బందులు పెట్టిన విషయం తన దృష్టికి రాగానే ఆ శాఖ మంత్రి కొండా సురేఖతో మాట్లాడానన్నారు.
ఏటూరునాగారం మండలం రొయ్యూరు వద్ద ఓ ఇష్యూ జరిగితే ఫారెస్ట్ సిబ్బంది తమకు చెప్పకుండా వెళ్లారని, దీంతో డీఎఫ్వోకు ఫోన్ చేసి ఎలాంటి దాడులు చేయొద్దని చెప్పానని గుర్తు చేశారు. ‘మావోయిస్ట్ పార్టీకి ఏ ఇన్ఫర్మేషన్ ఉందో నాకు తెలియదు, లెటర్ వాళ్లు విడుదల చేసిందో లేదో కూడా నాకు తెలియదు, నన్ను అనేటప్పుడు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి’ అని చెప్పారు. తాను ఎల్లప్పుడూ ప్రజల పక్షానే నిలబడ్డానన్నారు. ‘49 జీవో గురించి లేఖలో మాట్లాడిన్రు... నేను, బలరాంనాయక్తో పాటు ప్రతిపక్ష, అధికార పక్షం ఎమ్మెల్యేలు అందరం కలిసి జీవోను రద్దు చేయాలని తీర్మానం పెట్టా.. ఆ తీర్మానం ఇప్పటికీ ట్రైబల్ వెల్ఫేర్ హెడ్ ఆఫీస్లో ఉంది’ అని స్పష్టం చేశారు.